వెంటిలేటర్ల వినియోగంపై ఆడిట్ కు ప్రధాని ఆదేశం 

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటిలేటర్ల ఏర్పాటు, ఉపయోగంపై ఆడిట్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. దేశంలో కోవిద్ పరిస్థితిపై నిర్వహించిన అత్యున్నత అధికార సమీక్షా సమావేశంలో దేశంలో కొన్ని రాష్ట్రాలలో కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్లను ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉన్నట్లు వస్తున్న కధనాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

అవసరమైతే వెంటిలేటర్లను సక్రమంగా వినియోగించడం కోసం ఆరోగ్య కార్యకర్తలకు తగు శిక్షణ సదుపాయాలను ఏర్పరచాలని చెప్పారు. కరోనా పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతాలలో కట్టడి చేయడం కోసం స్థానిక వ్యూహాలను అనుసరించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.

గ్రామీణ ప్రాంతాలలో ఆక్సిజన్ కాన్సన్ట్రేట్రర్స్ తో పాటు ఆక్సిజన్ ను సరఫరా చేయడం కోసం తగు ప్రణాలికను రూపొందించాలని అధికారులను ప్రధాని కోరారు. అటువంటి పరికరాలను ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకార్త్యకర్తలకు తగు శిక్షణ కూడా సమకూర్చాలని, వాటి ఉపయోగం కోసం గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండేటట్లు కూడా చూడాలని ఆయన చెప్పారు.

ఎక్కువ పాజిటివ్ రేట్ నమోదవుతున్న ప్రాంతాలలో టెస్ట్ సదుపాయాలను పెంచాలని ప్రధాని సూచించారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటె తమకు అప్రదిష్ట అనే భావం లేకుండా పారదర్శకంగా వాస్తవ సంఖ్యను చెప్పే విధంగా రాష్ట్రాలను ప్రోత్సహించాలని ప్రధాని స్పష్టం చేశారు.

గ్రామాలలో ఇంటింటికి వెళ్లి టెస్ట్ చేయడంతో పాటు, నిరంతరం నిఘా ఉంచే విధంగా ఆరోగ్య కార్యకర్తలను సమాయత్తం చేయాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర వహించే విధంగా చేయడం కోసం ఆషా, అంగన్ వాడి కార్యకర్తలను కూడా సమీకరించాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా టీకాల కార్యకార్యక్రమం వేగవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయాలని అధికారులను ప్రధాని కోరారు. కాగా దేశంలో కరోనా టెస్ట్ లు గణనీయంగా పెరిగిన్నట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. మార్చ్ మొదట్లో వారానికి 50 లక్షల వరకు ఉన్న టెస్ట్ లు ఇప్పడు 1.3 కోట్లు వరకు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి అధికారులతో వర్చువల్‌ విధానంలో చర్చలు జరిపారు. సమావేశానికి పీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సెక్రెటరీ తదితరులు హాజరయ్యారు.