ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకాలు

ప్రజలను విపరీతంగా వేధిస్తున్న కోవిడ్-19 మహమ్మారిపై ఈ ఏడాది చివరికల్లా విజయం సాధించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరునాటికి దేశ ప్రజలందరికీ ఇచ్చేందుకు అవసరమైన కోవిడ్-19 టీకాల మోతాదులు తయారు కాబోతున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయనికొవిడ్‌-19 వ్యాక్సిన్‌ల‌పై ఏర్పాటైన నేస‌న‌ల్ టాస్క్‌ఫోర్స్ అధ్య‌క్షుడు, నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వినోద్ కుమార్ పౌల్ నీతీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రతి భారతీయునికి టీకా వేసిన తర్వాత చాలా డోసులు మిగిలిపోతాయని చెప్పారు. 

కొవిషీల్డ్ : 75 కోట్ల డోసులు 

కోవాగ్జిన్ : 55 కోట్ల డోసులు 

బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ : 30 కోట్ల డోసులు 

జైడస్ క్యాడిలా డీఎన్ఏ : 5 కోట్ల డోసులు 

ఎస్ఐఐ నోవావాక్స్ : 20 కోట్ల డోసులు 

భారత్ బయోటెక్ ఇంట్రానాజల్ : 10 కోట్ల డోసులు 

జెనోవా ఎంఆర్ఎన్ఏ : 6 కోట్ల డోసులు 

స్ఫుత్నిక్ వీ : 15.6 కోట్ల డోసులు – అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 

వీటితో దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్త‌వ‌డ‌మేగాక‌ మ‌రికొన్ని డోసులు మిగిలే ఉంటాయ‌ని చెప్పారు. ప్ర‌పంచంలో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా అమెరికాలో 26 కోట్ల డోసులను పంపిణీ చేశార‌ని పౌల్ చెప్పారు. 18 కోట్ల డోసుల‌తో భారత్ మూడో స్థానంలో ఉన్న‌ద‌న్నారు.

ఇప్పటి వరకు మన దేశంలో సుమారు 18 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు తెలిపారు. అమెరికాలో 26 కోట్ల డోసులను ఇచ్చారని చెప్పారు. స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి భారత దేశానికి వచ్చిందని, వచ్చే వారం నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. 

రాబోయే 15 రోజులకు భారత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు  తెలియజేసినట్లు తెలిపారు. అదేవిధంగా నెలకు సరిపోయే వ్యాక్సిన్లను నేరుగా మాన్యుఫ్యాక్చరర్ల నుంచి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు కొనుక్కోవచ్చునని తెలిపారు. 

దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్‌ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు 17,91,77,029 టీకాలు వేసినట్లు పేర్కొంది. మూడో దశ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో 18-44 మధ్య వయస్సున్న వారికి 39,14,688 డోసులు వేసినట్లు వివరించింది.

ఇప్పటి వరకు వేసిన టీకాల్లో 96,16,697 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి డోసు, 66,02,553 మందికి రెండో డోసు వేసినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో 1,43,14,563 మందికి మొదటి, మరో 81,12,476 మందికి రెండో మోతాదు అందించినట్లు తెలిపింది.

అలాగే 18-44 మధ్య వయస్సున్న 39,14,688 మంది లబ్ధిదారులకు తొలి మోతాదు వేసినట్లు పేర్కొంది. 45-60 సంవత్సరాల మధ్య వారికి 5,65,82,401 మొదటి, 85,14,552 మందికి రెండో డోస్‌ వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 60 ఏళ్లు పైబడిన 5,42,32,598 మందికి మొదటి, 1,72,86,501 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది. టీకా డ్రైవ్‌ గురువారం నాటికి 118వ రోజుకు చేరగా.. నిన్న ఒకే రోజు 19,75,176 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.