పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేసిన ప్రధాని 

‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమన్ నిధి’ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎనిమిదో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.19వేల కోట్లు నేరుగా జమకానున్నాయి. 
 
9.5 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు నేరుగా వారి అకౌంట్లకు బదిలీ అవుతాయి. ఈ స్కీమ్ కింద ఒక రోజులో ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుండటం ఇదే ప్రథమం. తొలిసారి ఈ పథకం ద్వారా పశ్చిమబెంగాల్ కు చెందిన 7,000 మంది రైతులు కూడా లబ్ధి పొందనున్నారు.
 
కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ నిధి పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. 100 శాతం కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. రైతులు వేసే పంటలకు పెట్టుబడి సాయం నిమిత్తం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. 
 
ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించింది. ఏప్రిల్-జూలై మధ్య, మొదటి విడత, ఆగస్టు-నవంబర్ మధ్య రెండవ విడత, డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడత నగదును జమ చేస్తుంది. మొత్తం 2 హెక్టార్ల కంటే భూమి తక్కువ రైతులు ఈ వార్షిక సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతారు.
 
 నగదు మన ఖాతాలో పడ్డాయో లేదో అనేది రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే  ఈ క్రింది విదంగా చేయండి:
 
  • పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు ‘గెట్ డేటా’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఎఫ్‌టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.