20న ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు

పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 20వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

దీంతో.. శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆ మేరకు గెజిట్‌ను జారీ చేశారు. 20న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోవిడ్‌–19 ఉధృతి, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.