బ్లాక్‌ఫంగస్‌పై భారత్ యుద్ధం 

అత్యంత అరుదైన, అసాధారణమైన బ్లాక్‌ఫంగస్ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్న వారిలో, శారీరక బలహీనతతో ఉన్న వారిలో మ్యుకోర్మికోసిస్ అనే బ్లాక్‌ఫంగస్ వ్యాపిస్తోంది. ఇది ఎక్కువగా దుమ్మూధూళితో శరీరకణాలలోకి ప్రవేశిస్తోంది. గుజరాత్, మహారాష్ట, ఇతర ప్రాంతాలలో ఈ ఫంగస్ ప్రాణాంతకంగా దాపురించడంతో కేంద్రం ఇప్పుడు ఔషధ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

అత్యధిక స్థాయిలో ఈ ఫంగస్ నివారణ మందులను ఉత్పత్తి చేయాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదో ఫంగస్ వైరల్ తెగులు కావడంతో ఈ అంశంపై కేంద్ర ఎరువులు, రసాయనికాల మంత్రిత్వశాఖ పలు సూచనలు వెలువరించింది. కొవిడ్ ఓ వైపు అదుపులోకి రాకపోవడం, మరో వైపు ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ రావడం కీలక ఆరోగ్య విషమ పరిస్థితిని తెచ్చిపెట్టింది.

పలు ఆసుపత్రులు ఇప్పుడు ఈ ఫంగస్ చికిత్స కోసం సరైన ఏర్పాట్లకు దిగాల్సి వస్తోంది, ముక్కు పుటాల నుంచి ఈ ఫంగస్ చొచ్చుకుపోతోంది. తద్వారా బ్రెయిన్‌ను, ఊపిరితిత్తులను ఇతర కీలక అవయవాలను దెబ్బతీస్తూ చివరికి ప్రాణాలను హరించివేస్తోంది. ఈ వైరస్ కణజాలానికి ప్రభావితం అయిన వారి ముఖకవళికలలో తేడా వస్తోందని గుర్తించారు.

ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు అత్యవసరంగా ఆంఫోటెరిసిన్ బి వంటి ఔషధాలు అవసరం. అయితే ఇప్పటి డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో వచ్చే రోగులకు చికిత్స కష్టం అవుతోంది. వెంటనే సంబంధిత మందుల ఉత్పత్తిని బాగా పెంచాలని కేంద్రం సూచించింది. ఆంఫోటెరిసిన్ బిని పలు చోట్ల డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.

దేశీయంగా ఉత్పత్తి సమస్య ఉండటంతో విదేశాల నుంచి దీనిని దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు ఈలోగా దేశంలో దీని ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మందులు అవసరం అయిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వపు ఫార్మా విభాగం నుంచి సరఫరా అవుతున్నాయి.

ఉత్పత్తి అందుబాటులోకి వచ్చేదానిని బట్టి ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఈ మందును అందిస్తామని కేంద్రం తెలిపింది. సరైన విధంగా బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు అవసరం అయిన యంత్రాంగాన్ని సంసిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు వెలువరించింది. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ మందు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు.