తొలుత ఢిల్లీ డీఆర్‌డీఓ ద‌వాఖాన‌లో 2-డీజీ ఔషధం 

క‌రోనా వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు సిద్ధం చేసిన 2-డీజీ ఔష‌ధాన్ని తొలుత ఢిల్లీలోని డీఆర్‌డీఓ ద‌వాఖాన‌లో ఇవ్వ‌నున్నారు. ఈ ఔష‌ధం ఒక‌టి, రెండు రోజుల్లో ఈ ద‌వాఖాన‌కు చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పొడి రూపంలో ల‌భించే ఈ ఔష‌ధం క‌రోనాను నివారించ‌డంలో ప్ర‌భావ‌వంతంగా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

అయితే, ఈ ఔష‌ధానికి అత్య‌వ‌స‌ర వినియోగం కోసం అనుమ‌తి పొందాల్సి ఉన్న‌ది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దిగజారుతున్న పరిస్థితుల‌ను పరిష్కరించేందుకు కేంద్ర‌ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్న‌ది. క‌రోనా వైర‌స్‌ను నివారించేందుకు డీఆర్‌డీఓ అధికారులు 2-డీజీ ఔష‌ధాన్ని క‌నిపెట్టారు.

ఈ ఔష‌ధం పొడి రూపంలో ల‌భిస్తుంద‌ని, క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో మంచి ఫ‌లితాల‌ను పొంద‌నట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అత్యవసర ఉపయోగానికి ఆమోదం పొందిన తర్వాత తొలుత ఢిల్లీలోని డీఆర్‌డీఓ కొవిడ్ ద‌వాఖాన‌లో చేరిన రోగులకు అందించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఒక‌టి రెండు రోజుల్లో ఈ ఔష‌ధం డీఆర్‌డీఓ ద‌వాఖాన‌కు చేర‌నున్న‌ది. ఈ పొడిని ఉపయోగించడం చాలా సులువు అని, గత ఒక సంవత్సరం పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా తయారు చేసిన‌ట్లు డీఆర్‌డీఓ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

డీఆర్‌డీఓ ల్యాబ్ హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. క్లినికల్ పరిశోధనలో 2-డీజీ ఔషధం యొక్క 5.85 గ్రాముల సాచెట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సాచెట్‌ను ఉదయం, సాయంత్రం నీటిలో కరిగించి రోగులకు ఇవ్వ‌నున్నారు. ఈ మందులు ఇచ్చిన రోగులు వేగంగా కోలుకోవడం కనిపించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాతిపదికన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ ఔషధం అత్యవసర వాడకానికి ఆమోదించింది.

దేశవ్యాప్తంగా 27 ద‌వాఖాన‌ల్లో ఈ ఔషధం చివరి పరీక్షలు జరిగాయని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. ఈ ఔష‌ధాలను ఢిల్లీకి తీసుకువచ్చే పని వేగంగా జరుగుతున్న‌ద‌ని, ప్రస్తుతం, ఈ మందును వైద్యుల సలహా మేరకు మాత్రమే ద‌వాఖాన‌ల్లో ఇచ్చేందుకు అనుమ‌తిస్తార‌ని వారు వెల్ల‌డించారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో వాణిజ్య ఉపయోగం కోసం ద‌వాఖాన‌లకు కూడా పంపనున్నారు. అయితే, మార్కెట్లో విక్రయించడానికి డీసీజీఐ నుంచి అనుమతి పొందడం త‌ప్ప‌నిస‌రి.