కరోనా బాధితులకు తెలంగాణలో ప్రవేశం లేదు 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్‌ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. 

సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు.  తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు.

ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్‌ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద  ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్‌ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్‌ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్‌ సిలిండర్లతో లైఫ్‌ సపోర్ట్‌ వచ్చిన వారే కావడం గమనార్హం.

తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్‌షీట్‌ చూసి కరోనా పాజిటివ్‌ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. 

కొన్నిచోట్ల బెడ్‌ అలాట్‌మెంట్‌ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లో బెడ్లు లేవని, ఆక్సిజన్‌ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు.