370 ఆర్టికల్ రద్దు భారత్ అంతర్గత విషయమే

భారత్ జమ్మూ, కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం గురించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,  ఆ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు చేస్తుండగా, ఈ  రద్దు పూర్తిగా భారత్ అంతర్గత విషయమే అంటూ స్వయంగా ఆ దేశం విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి పేర్కొనడం సంచలనం కలిగిస్తున్నది. 

ఇటీవల పాక్‌లోని ప్రముఖ సమీ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. 

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 తొల‌గింపు విష‌యం ఇంతకుముందు ఎటువంటి సమస్య లేదని, ఇప్పుడు కూడా లేదని స్పష్టం చేయాలనుకుంటున్నానని తెలిపారు. అది ముమ్మాటికీ భారతదేశం అంతర్గత విషయం అని మేం నమ్ముతున్నామ‌ని తేల్చి చెప్పారు. 

అంతేకాకుండా ఈ విషయంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. అయితే, సెక్షన్ 35 ఏ తొలగింపుపై మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని చెప్పారు. సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ఖురేషి ఈ ప్రకటన చేశారు.

ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచంలోని ఇతర వేదికలపై ఆర్టికల్ 370 ని తొలగించడాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వ్యతిరేకిస్తున్నందున ఖురేషి వ్యాఖ్య‌ల‌తో పాకిస్తాన్ యూ టర్న్‌గా పరిగణించవచ్చు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాకిస్థాన్‌పై సౌదీ అరేబియా, యూఏఈ ఒత్తిడి పెంచుతున్నాయని పాకిస్తాన్‌లో వార్తలు వస్తున్న సమయంలో ఈ వాఖ్యలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.

ఇక భారత్‌-పాక్‌ మధ్య ఇతర విషయాల్లో ఉన్న విభేదాలు కూడా కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఖురేషీ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము యుద్ధాన్ని కాంక్షించమని, యుద్ధం ఎప్పుడూ ఆత్మహత్యా సదృశమని అందువల్ల ప్రతి విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

 ఏకంగా విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం ఇరుకున పడ్డట్లైంది. 2018లో 370 ఆర్టికల్ రద్దు సమయం నుంచి ఇమ్రాన్ ప్రభుత్వం భారత్‌ను ఈ విషయంలో వ్యతిరేకిస్తూనే ఉంది. 

కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు భారత్-పాక్ సంబంధాలు పూర్వ స్థితికి చేరుకోవంటూ అప్పట్లో ఇమ్రాన్ తేల్చి చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మంత్రి ఇలా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.