పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్ర‌మాణం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగ‌సామి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రంగ‌సామి చేత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. 

పుదుచ్చేరి రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. పుదుచ్చేరి సీఎంగా ప్ర‌మాణం చేసిన రంగ‌సామికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో పదింటిని గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షం బీజేపీ తొమ్మిది స్ధానాల్లో పోటీ చేయగా.. ఆరు చోట్ల విజయం సాధించింది. 

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా.. వారంతా రంగస్వామి మద్దతుదారులే. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్‌ 14 స్థానాల్లో పోటీ చేయగా.. రెండింట విజయం సాధించింది.

రంగ స్వామి 2001లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.