ఏపీకి 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

కోవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్‌ అందించేందుకు 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఒక్కో ట్యాంకర్‌ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు.
 
కోవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామని పెక్రోన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌(నెట్‌వర్క్‌) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్‌ బాధితులకు ఇవ్వాలని సింఘాల్‌ స్పష్టం చేశారు.
 
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్‌మెంట్‌ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తామని చెప్పారు. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నామనితెలిపారు. 
 
ఈ వివరాలన్నీ 104 కాల్‌సెంటర్‌ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలని వివరించారు.
ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్‌ పీఏఎస్‌లు ఏర్పాటవుతాయి.  3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టెండర్‌లు పిలిచామని తెలిపారు.