
రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా మారారు.
ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్, రెవెన్యూఅధికారులు తేల్చారు. ఈ పరిణామంతో ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయమని కోరే అవకాశం వుంది.
ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈటల భూ కబ్జాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు తెలిపారు. అచ్చంపేట్, మాసాయిపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ అక్రమంగా లాక్కున్నారని సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేయడం, వెంటనే దర్యాప్తుకు ఆదేశించడం క్షణాలలో జరిగింది.
ఈ నేపథ్యంలో అధికారులు.. ఈటల హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అచ్చంపేట, మాసాయిపేటలో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేశారు. రైతుల నుంచి వివరాలను సేకరించారు. క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.
తన శాఖను సీఎం కేసీఆర్కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ‘సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని ఈటల ప్రకటించారు.
More Stories
నాగారంలో భూదాన్ భూముల స్వాహాకు కుట్ర
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ లేఖ
నటి కల్పిక గణేశ్పై మరో కేసు నమోదు