పాక్ రెచ్చ గొడితే సైనిక శక్తితో మోదీ జవాబు 

పాకిస్థాన్  రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే నరేంద్ర మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులిచ్చే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
రెండు దేశాలు యుద్ధానికి దిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మధ్య వివాదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ నివేదికలో అభిప్రాయపడ్డాయి. ‘పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే..లేదా అలా చేసినట్టు భారత్ భావిస్తే..మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులివ్వచ్చు’ అని స్పష్టం చేసింది.
గతంలో కంటే ఇప్పుడు ఈ అవకాశం మరింత పెరిగింది. ఇరు దేశాల మధ్య నెలకొనే ఉద్రిక్తతలు ఘర్షణకు దారితీసే అవకాశాలను పెంచుతాయి. కశ్మీర్‌లో హింస ప్రజ్వరిల్లడం, ఇతర ప్రాంతాల్లో మిలిటెంట్ దాడులు ఈ వివాదాలకు కేంద్రంగా మారొచ్చని ఈ నివేదికలో వెల్లడైంది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు దేశాలూ తమ హైకమిషనర్లను స్వదేశానికి పిలిపించుకున్నాయి. పాక్‌‌తో దౌత్యసంబంధాలు సాధారణ స్థితికి రావాలని తాము కోరుకుంటున్నట్టు భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే.. ఉగ్రవాదం, హింసకు చోటులేని వాతావరణంలోనే ఇది సంభవమని, ఇటువంటి వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పాకిస్థాన్‌దేనని భారత్ స్పష్టం చేసింది.

 అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక ప్రకారం.. అప్ఘానిస్థాన్, ఇరాక్, సిరియా‌లో అశాంతి, హింస అమెరికా సైన్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. ఇక భారత్-పాక్ ఉద్రిక్తతలు ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశమని జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది.

కాగా, భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఇంకా ఉద్రిక్త ఉన్న‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న‌ది. స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా త‌న ఆధిప‌త్యాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు అమెరికా ఆరోపించింది. దీని కోసం ప్రాంతీయ దేశాల‌పైన కూడా డ్రాగ‌న్ వ‌త్తిడి తెస్తున్న‌ట్లు అగ్ర‌రాజ్యం చెప్పింది. 

గ‌త ఏడాది మే నెల‌ల రెండు దేశాల మ‌ధ్య గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత రెండు దేశాలు చ‌ర్చ‌ల ద్వారా త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కి ర‌ప్పించినా.. బోర్డ‌ర్ వ‌ద్ద మాత్రం టెన్ష‌నే ఉన్న‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్ల‌డించింది.

ద‌క్షిణ‌ చైనా స‌ముద్ర జ‌లాల‌పై ప‌ట్టు కోసం ప్రాంతీయ దేశాల‌ను చైనా బెదిరిస్తున్న‌ట్లు అమెరికా పేర్కొన్న‌ది. ద‌క్షిణాసియా దేశాల‌పై డ్రాన‌గ్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెప్పింది. తూర్పు చైనా స‌ముద్ర జ‌లాల అంశంలో జ‌పాన్‌పై పెత్తనం చెలాయిస్తున్న‌ట్లు అమెరికా అభిప్రాయ‌ప‌డింది. చైనా త‌న అణ్వాయుధ సామ‌ర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.