మావోయిస్టులకు పారిపోవ‌డం ఒక్క‌టే మార్గం

మావోయిస్ట్ క‌మాండ‌ర్ మాద్వి హిడ్మాలాంటి వాళ్లు త్వ‌ర‌లోనే చ‌రిత్ర‌లో క‌లిసిపోతార‌ని సెంట్రల్ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) చీఫ్ కుల్‌దీప్ సింగ్‌ హెచ్చరించారు. న్యూస్ 18 చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న గ‌త వారం చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో న‌క్స‌ల్స్ పాల్ప‌డిన హింస‌పై స్పందించారు. 

త‌ర్వాతి ద‌శ ఆప‌రేష‌న్ల కోసం ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర ప్ర‌ణాళిక‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే వాళ్ల‌కు ప‌ట్టున్న చాలా ప్ర‌దేశాలను ఆక్ర‌మించేసిన‌ట్లు చెప్పారు. వాళ్లు ప్ర‌స్తుతం ఓ చిన్న ప్రాంతానికే ప‌రిమిత‌మ‌య్యారు. వాళ్ల‌ను ఏరేయ‌డం లేదంటే వాళ్లే పారిపోవ‌డం ఒక్క‌టే మార్గం అని కుల్‌దీప్ సింగ్ తేల్చి చెప్పారు.

గ‌తంలో 100 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర మావోయిస్టులు ఉండేవాళ్లని, ఇప్పుడు అది 20 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు ప‌డిపోయింద‌ని తెలిపారు. ఏడాదిలోపే ఆ చోట్ల కూడా వాళ్లు దాక్కున్న ప్ర‌దేశాల‌ను జ‌ల్లెడ ప‌ట్టి ఏరేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. హిడ్మాలాంటి వాళ్లు సంగ‌తేంట‌ని అడ‌గ్గా.. క‌చ్చితంగా చెప్ప‌లేను కానీ అలాంటి వాళ్లు త్వ‌ర‌లోనే చ‌రిత్ర‌లో క‌లిసిపోతారు అని అన‌డం గ‌మ‌నార్హం.

24 మంది భ‌ద్ర‌తా సిబ్బందిని ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మార్చిన ఘ‌ట‌న వెనుక కీల‌క సూత్ర‌ధారి హిడ్మానే అని అనుమానిస్తున్నారు. సుక్మాకు చెందిన ఈ 40 ఏళ్ల హిడ్మా  మావోయిస్టుల ప్ర‌ధాన దాడుల‌లో కీల‌కపాత్ర పోషిస్తున్నాడు.