టిఆర్‌ఎస్‌లో చేరిన తెలంగాణలో ఏకైక టిడిపి ఎమ్యెల్యే 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే టిడిపి నుంచి గెలిచిన సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరగా, తాజాగా అశ్వారావుపేట ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దాంతో రాష్ట్రంలో టిడిపికి ఉన్న ఇద్దరు ఎంఎల్‌ఎలూ టిఆర్‌ఎస్ మద్దతు తెలిపినట్లయింది. 

ఈ మేరకు బుధవారం టిడిపి శాసనసభాపక్షాన్ని టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ ఎంఎల్‌ఎలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో తెలంగాణ టిడిపి శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎంఎల్‌ఎలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

తరువాత కొంతకాలానికి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీలో చేరగా, తాజాగా మెచ్చా నాగేశ్వర్ రావు టిడిపికి రాజీనామా చేశారు. అనంతరం టిడిపిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేస్తున్నట్లు ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వర్ రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ అందజేశారు. దీంతో తెలంగాణ శాసనసభలో టిడిపికి ప్రాతినిథ్యం లేనట్టు అయింది.