స్టాలిన్, ఉదయనిధిలపై ఈసీఐకి ఫిర్యాదు

ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతలు డబ్బులు పంచుతున్నారంటూ అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ సహా పలువురు నేతల అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ)కు  ఫిర్యాదు చేసింది.
 
 అన్నాడీఎంకే అడ్వకేట్ విభాగం ప్రధాన కార్యదర్శి ఆర్ఎం బాబు మురుగవేల్ ఈ మేరకు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ కొలతూరు నియోజకవర్గంలో తన భర్త తరఫున ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారని, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.10,000 ఇచ్చారని మురగవేల్ ఆరోపించారు. స్టాలిన్ సంబంధీకులు ఓటర్లకు జి-పే ద్వారా రూ.5,000 పంపిణీ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
తిరుచిరాలపల్లి వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఎన్ నెహ్రూ, చెపాక్-తిరువల్లికేని నుంచి పోటీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్, తిరువణ్ణామలై నుంచి పోటీలో ఉన్న ఈవీ వేలు, కాట్పడి నుంచి ఎన్నికల బరిలో ఉన్న దురై మురుగన్‌లు తమ సన్నిహితులు ద్వారా, జీ-పే ద్వారా రూ.2,000 నుంచి రూ.5,000 పంచుతున్నారని కూడా అన్నాడీఎంకే నేత ఫిర్యాదు చేశారు.
నిషేధిత వీడియోలు, క్లిప్పింగులు, ఫూటేజ్ ప్రసారం చేయకుండా సన్ న్యూస్ ఛానెల్‌ను నిలువరించాలని, షోకాజ్ నోటీసు పంపాలని కూడా ఈసీని అన్నాడీఎంకే ఈ ఫిర్యాదులో కోరింది. ఈసీ లెక్కల ప్రకారం తమిళనాడులో ఇంతవరకూ రూ.428.46 కోట్ల రూపాయలు విలువచేసే నగదు, మద్యం, ఇతర సామాగ్రి సీజ్ చేశారు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు ప్రకటిస్తారు.