అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అద్భుత‌ ఫలితాలు సాధిస్తాం 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధించ‌బోతున్న‌ద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తంచేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం ఖాయ‌మ‌ని చెన్నైలో చెప్పారు.

త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే నాయ‌క‌త్వంలో తాము మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని చెప్పారు.  ప్రధాన మంత్రికి మద్దతు ఇవ్వడం గురించి తమిళ నాడు ప్రజల స్ఫష్టమైన నిర్ణయానికి వచ్చారని చెబుతూ నరేంద్ర మోదీ పాలనలో రాష్ట్రంలో చేబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు చూస్తున్నారని తెలిపారు.

ఇక‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లోనూ రెండు విడ‌త‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని ప‌రిశీలిస్తే బీజేపీ విజ‌యం వైపు దూసుకుపోతున్న‌ద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని జేపీ న‌డ్డా పేర్కొన్నారు. అసోంలోనూ యూపీపీఎల్‌, ఏజీపీతో క‌లిసి తాము అధికారాన్ని నిల‌బెట్టుకుంటామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తంచేశారు.

 పుదుచ్చేరిలోనూ తమ విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పారు. ఇక కేర‌ళ‌లోనూ బీజేపీ మునుప‌టి కంటే బ‌లంగా ఉందని  చెబుతూ ప్రజలు బిజెపికి మద్దతు ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు.