పరిషద్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ 

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నిర్వహణపై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. పరిషత్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు ఆదివారం హైకోర్టులో ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. 

ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలపై తాజాగా ఎస్‌ఇసి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ బిజెపి, జనసేన దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు శనివారమే పూర్తయ్యాయి. 

అనంతరం దీనిపై ఎస్‌ఇసి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఎస్‌ఇసి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఇసి తరఫు న్యాయవాది వివరించారు. 

పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్‌ఇసి తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తూ.. తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది.