నాకేమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత

నాకేమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత
“నన్ను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు… నాకు ఏదైనా జరిగితే కేసీఆర్ కుటుంబ సభ్యులదే బాధ్యత” అని బీజేపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆరోపించారు. 
 
బీజేవైఎం చేపట్టిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన బొడిగె శోభ ఇవాళ ఉదయం 10.15గంటలకు నన్ను చంపుతానని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారని, అపరిచిత వ్యక్తులు చేసిన ఫోన్ కాల్ పై కరీంనగర్ సీపీ ఫిర్యాదు చేశానుని చెప్పారు. తనకు  ఏం జరిగినా కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. 
 
అధికార పక్షం నుండి గతంలో బీజేపీలో చేరిన ఆమె అడ్వకేట్ వామన్ రావు దంపతుల లాగా తనను  కూడా చంపాలని చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శలపై తాను మాట్లాడబోనని ఆమె స్పష్టం చేశారు.  ఆయనను విమర్శించేంత తక్కువ స్థాయి తనది కాదని చెప్పారు. 
 
“సుంకె రవిశంకర్ నా జాతి వ్యక్తి కాబట్టి నేను మాట్లాడను.. గతంలో మంద కృష్ణ మాదిగ పై కూడా విమర్శలు చేయాలని కేసీఆర్ చెప్తే నేను మాట్లాడలేదు… కేటీఆర్, సంతోష్ రావు కలిసి నన్ను చంపించాలని ఓ మనిషిని పెట్టారనిపిస్తోంది.. అయినా నేను భయపడేది లేదు..నాకేమైనా జరిగితే వీళ్లిద్దరిదే బాధ్యత..’’ అని బొడిగె శోభ పేర్కొన్నారు.