బాలీవుడ్‌ నటుడు‌ అక్షయ్‌ కుమార్‌కు కరోనా

బాలీవుడ్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వెల్లడించారు. 

కొవిడ్‌ నిబంధనల మేరకు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ రామ్‌ సేత షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్‌, మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, అమీర్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కరిక్‌ ఆర్యన్‌, రోహిత్‌ సరఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, మనోజ్‌ బాజ్‌పేయి, రణ్‌వీర్‌ షోరే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. 

శనివారం ప్రముఖ సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ కొడుకు ఆదిత్య నారాయణ్‌తో పాటు కోడలికి వైరస్‌ సోకింది. రోజు రోజుకు వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బాలీవుడ్‌లో ఆందోళన కలిగిస్తోంది.

 దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారి కొత్త కేసుల పెరుగుదలతో పాటు మరణాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. గడిచి 24 గంటల్లో 93,249 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 513 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

 మరోవంక,దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో టీకా తీసుకున్నారు. 

గత నెల 1న తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మొదటి డోసు వేయించుకున్నారు. దేశంలో మార్చి 1న రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7,59,79,651 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.