రైతులకు రూ 300 కోట్ల ఇసుక బకాయిలు చెల్లించని కేసీఆర్ 

గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రుణాల రద్దును రెండేళ్లు దాటినా అమలు పరచని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రూ 300 కోట్ల మేరకు ఇసుక బకాయిలు చెల్లింపకుండా 5,000 మంది రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ మొత్తాలను ఇతర అవసరాలకు వాడేసుకున్న ప్రభుత్వం రైతులకు మొండి చెయ్యి చూపుతున్నది. 

బకాయిలు ఇప్పించమని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నా పనికావట్లేదు. వాళ్లు ఆఫీసర్లను అడిగితే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని, ఇప్పట్లో ఇవ్వడం కుదరదని చెప్పినట్టు తెలిసింది. దీంతో సొంత ప్రభుత్వాన్ని ఏమనలేక, రైతులకు ఏదో ఒకటి సర్దిచెప్పి పంపిస్తున్నారు.

రాష్ట్రంలో రైతుల భూముల్లోని ఇసుకను ఆన్ లైన్ లో టీఎస్ఎండీసీ (తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్) అమ్ముతోంది. ఇట్ల అమ్మిన ఇసుక ఆదాయంలో 35 శాతాన్ని రీచ్ లపై హక్కులున్న రైతులు, సొసైటీలకు చెల్లించాలి. అక్రమాలు జరుగుతున్నాయనే కారణంతో సర్కార్ ఈ పాలసీ రూపొందించింది.

దీంతో ఏటా ప్రభుత్వానికి ఇసుక అమ్మకాల వల్ల దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రతి రెండు నెలలకు ఓసారి ఇలా వచ్చిన ఆదాయంలో రైతుల వాటా చెల్లించేది. అయితే ఏడాదిన్నరగా దాదాపు రూ.300 కోట్ల బిల్లుల చెల్లింపు నిలిపేసిట్టు రైతులు చెప్తున్నారు. నది తీరాల్లోని ఇసుక రీచ్ లు ఎక్కువగా ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. ఈ రీచ్ లోని ఇసుకను స్థానిక గిరిజనులు ఒక సొసైటీగా ఏర్పడి టీఎస్ఎండీసీ ద్వారా అమ్ముతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 గిరిజన సొసైటీలలో 4 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

మిగతా ఇసుక రీచ్ లు ఇతర వర్గాలకు చెందిన రైతుల భూముల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 495 ఇసుక రీచ్ లు ఉన్నాయి. వీటిలో రెండు మూడు మాత్రమే లోకల్ బాడీల ఆధీనంలో ఉన్నాయి. ఏడాదిన్నరగా తమ వాటా డబ్బులు చెల్లించకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. రైతుల వత్తిడుల మేరకు కొందరు మంత్రులు నేరుగా టీఎస్ఎండీసీ అధికారులకు ఫోన్ చేసి, ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని అడగ్గా ఆర్ధిక శాఖ నిధులను విడుదల చేయడం లేదని చెప్పి ఉరుకొంటున్నారు. దానితో మంత్రులు సహితం ఏమీ చేయలేక పోతున్నారు