తృణమూల్ నేత చత్రధర్‌ మెహతో అరెస్ట్ 

తృణమూల్ నేత చత్రధర్‌ మెహతో అరెస్ట్ 
2009లో పశ్చిమ బెంగాల్‌లోని ఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ కేసుతో పాటు సిపిఎం నేత పబ్రీర్‌ ఘోష్‌ హత్య కేసులో సంబంధం ఉన్న ఆరోపణలపై గిరిజన నేత, తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు చత్రధర్‌ మెహతోను ఆదివారం తెల్లవారు జామున జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అరెస్టు చేసింది.
 
ఝార్‌గ్రామ్‌ జిల్లాలోని ఆమ్లియాలోని ఆయన నివాసం నుండి అరెస్టు చేసి..ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచామని అధికారులు వెల్లడించారు. మావోయిస్టుతో సంబంధాలున్న పీపుల్స్‌ కమిటీ ఎగనెస్ట్‌ పోలీస్‌ అట్రాసిటీ (పిసిఎపిఎ) సభ్యులు ఈ హైజాగ్‌కు పాల్పడ్డారని అధికారులు పేర్కొంటున్నారు. 
 
సాయుధ హైజాకర్లు..ఆ ట్రైన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని..ప్రయాణీకులను వెళ్లిపోవాలని వారితో చెప్పించారని తెలిపారు. ఈ హైజాక్‌కు కారణం..అప్పుడు జైలులో ఉన్న మెహతోను విడుదల చేసేందుకు పన్నిన కుట్రగా అభివర్ణించారు. 
 
గతంలో ఈ కేసుపై బెంగాల్‌ పోలీసులు విచారణ చేపట్టిన సమయంలో కూడా..ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. కాగా, ఈ హైజాక్‌ ఘటనపై మెహతో, పిసిఎపిఎ పాత్ర దర్యాప్తు చేయాలని ఈ కేసును గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఎకు అప్పగించింది. ఈ ఘటనపై ఐపిసిలోని 121,121ఎ, 506, 341, 148 సెక్షన్‌లతో పాటు రైల్వే యాక్ట్‌ కింద కేసు నమోదు చేసింది.