మిథాలీ రాజ్‌, పీవీ సింధులపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీరాజ్‌, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధులపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. మార్చి 8న ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం జ‌రుపుకున్నామ‌ని, ఇదే నెల‌లో చాలామంది భార‌త మ‌హిళా క్రిడాకారిణిలు త‌మ పేరిట స‌రికొత్త‌ రికార్డులు న‌మోదు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మ‌న్ కీ బాత్ 75వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం ఆకాశవాణిలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని.. దేశంలో విజేత‌లుగా నిలిచిన ప‌లువురు మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. మహిళా క్రికెట్ చ‌రిత్ర‌లో 10 వేల ప‌రుగుల‌ మైలురాయిని దాటిన తొలి భార‌త క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచార‌ని, ఆమె సాధించిన విజయానికి తాను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని ప్ర‌ధాని చెప్పారు.

అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావించారు. సింధు అద్భుత‌మైన క్రీడా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అనేక అవార్డులు అందుకున్నారని ప్ర‌ధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్ద‌రూ భ‌విష్య‌త్ త‌రాల‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని ఆయ‌న కొనియాడారు.

 ఢిల్లీలో జ‌రిగిన ఐఎస్ఎస్ఎఫ్ వ‌ర‌ల్డ్ క‌ప్ షూటింగ్‌లోనూ మ‌హిళలు ప‌తకాల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచార‌ని, బంగారు ప‌తకాల జాబితాలోనూ భార‌త్ ముందంజ‌లో ఉన్న‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద‌దైన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కు‌రువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ఉత్సాహంగా ముందుకు వ‌స్తున్నార‌ని తెలిపారు.

హైదరాబాద్‌లో జయ్ చౌదరీ అనే వందేండ్ల‌ వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ని, యూపీలో 109 ఏండ్ల రామ్ దుల‌య్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవ‌ల్ కృష్ణ క‌రోనా క‌రోనా టీకా వేయించుకున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు.

కాబ‌ట్టి ప్ర‌జ‌లు వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని, అంద‌రూ ధైర్యంగా ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు. గ‌త ఏడాది మార్చిలో జ‌న‌తా క‌ర్ఫ్యూ అనే ప‌దాన్ని కొత్త‌గా విన్నామ‌ని, దేశంలో పాటించిన ఆ జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్రపంచానికే మార్గ‌ద‌ర్శ‌నం చేసింద‌ని చెప్పారు. దేశంలో అసాధార‌ణ‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ‌కు అది నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.