బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడి వాహనం ధ్వంసం!

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్‌ జిల్లా సబజ్‌పుత్‌ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పాల్పడి ధ్వంసం చేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు రామ్‌ గోవింద్‌దాస్‌ ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని సుమేందు ఆయన సోదరుడు దివ్వేందు అధికారి ఆరోపించారు. ఆ ప్రాంతంలో మూడు పోలింగ్‌ కేంద్రాల్లో తృణమూల్‌ నేత రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వారు ఆరోపించారు.

ఈ దాడిలో తాను క్షేమంగా బయటపడ్డానని సుమేందు అధికారి వెల్లడించారు. మూడు పోలింగ్‌ కేంద్రాల్లో తృణమూల్‌ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తాను ఇక్కడకు రావడంతో వారు రెచ్చిపోయి తన వాహనంపై దాడి చేసి డ్రైవర్‌ను తోసివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈసీ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లామని దివ్యేందు అధికారి తెలిపారు.

టీఎంసీ బ్లాక్ అధ్యక్షుడు రామ్ గోవింద్ దాస్, ఆయన భార్య ఆధ్వర్యంలో మూడు పోలింగ్ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగుకు పాల్పడ్డారని ఆరోపించారు. తన రాకతో వారి రిగ్గింగుకు అడ్డుకట్ట పడిందని, ఈ కారణం వల్లే తనను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని సోమేందు ఆరోపించారు.

టీఎంసీ కార్యకర్తల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు దారుణంగా గాయపడ్డారని, వారిప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమేందు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పోలీసులు అనేవారు ఎవరూ లేరని, వారంతా టీఎంసీ కేడర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోంటై పోలింగ్ కేంద్రంలో కొందరిని ఓటు వెయ్యకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

కాగా, రెండు రాష్ట్రాలకు శనివారంనాడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.  సాయంత్రం 30 గంటల వరకూ అసోంలో 72 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో80 శాతం వరకు పోలింగ్ నమోదైంది. 

అసోంలో రెండు విడతల పోలింగ్‌లో భాగంగా తొలి విడతగా 47 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతగా 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 విడతలుగా బెంగాల్‌లో పోలింగ్ జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.