68 శాతం మంది విద్యుత్ వాహనాల వైపు మొగ్గు 

66 శాతం మంది వినియోగదారులు విద్యుత్ వాహ‌నాల కొనుగోలు చేయ‌డానికే మొగ్గు చూపుతున్నార‌ని కారుదేఖో ఓఎంజీ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో నిర్ధార‌ణైంది. వారిలో 53 శాతం మంది గ‌ట్టిగా విద్యుత్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌డానికి ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.
 
 ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ కోసం 68 శాతం మంది విద్యుత్ వాహ‌నాల వైపు మొగ్గుతున్నారు. విద్యుత్ వాహ‌నాల వైపు మ‌ళ్ల‌డం వ‌ల్ల 11 శాతం మంది స్మూత్‌గా డ్రైవ్ చేయ‌డానికి వీల‌వుతుంద‌ని, ఆరు శాతం మంది నిర్వహణ వ్య‌యం త‌గ్గుతుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.
 
కేంద్ర ప్ర‌భుత్వం సైతం విద్యుత్ ఆధారిత వాహ‌నాల వాడ‌కాన్నే ప్రోత్స‌హిస్తున్న‌ది. ప్ర‌స్తుతం మొత్తం వాహ‌నాల్లో ఒక శాతంలోపే ఉన్న విద్యుత్ వాహ‌నాలు వ‌చ్చే ఐదేండ్ల‌లో ఐదు శాతానికి చేర‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.
 
అంత‌ర్జాతీయంగా, జాతీయంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళుతున్నాయి. దానితో పెట్రోల్ లేదా డీజిల్ వినియోగంతో న‌డిచే వాహ‌నాల స్థానే విద్యుత్ వినియోగ వాహ‌నాల కొనుగోలు చేయ‌డానికి మొగ్గు చూపుతున్నారు.
 
2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో సుమారు 3.8 ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అమ్ముడ‌య్యాయి. వాటిలో లో స్పీడ్ ఈ3డ‌బ్ల్యూ వాహ‌నాలు 58 శాతం, ఈ2డ‌బ్ల్యూ వాహ‌నాలు 40 శాతం ఉంటాయ‌ని కారు దేఖో ఓఎంజీ సంస్థ స‌ర్వేలో తేలింది.
 
విద్యుత్ వాహ‌నాలను త‌యారు చేయ‌డంలో స్వావ‌లంభ‌న సాధించాల‌ని కేంద్ర ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ దేశీయ బ్యాట‌రీ టెక్నాల‌జీ సంస్థ‌ల‌ను కోరారు. ఇప్ప‌టికే ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు ప‌లు ఈవీ-4 వీల‌ర్ మోడ‌ల్స్ మార్కెట్‌లో ఆవిష్క‌రించాయి