గ్లోబల్‌ నాలెడ్జ్‌ సూపర్‌ పవర్‌గా భారత్ 

21వ శతాబ్దంలో భారతదేశాన్ని గ్లోబల్‌ నాలెడ్జ్‌ సూపర్‌ పవర్‌గా మార్చడమే జాతీయ విద్యా విధానం లక్ష్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కెలా 18వ వార్షికోత్సవ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఒక విశ్వవిద్యాలయం, ఒక సంస్థ తన పరిసరాల్లోని సమాజాన్ని శక్తిమంతం చేయడానికి సహకరించాలని సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు గురించి మాట్లాడుతూ భారత్‌ను గ్లోబల్‌ నాలెడ్జ్‌ సూపర్‌ పవర్‌గా మార్చే లక్ష్యాన్ని సాధించడంలో ఎన్‌ఐటీ రూర్కెలా వంటి సంస్థలు ప్రాధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మహిళా సాధికారత గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో అబ్బాయిలను అమ్మాయిలు మించిపోతున్న అంశాన్ని తాను గమనించానని తెలిపారు. చాలా ప్రాంతాల్లో వారే ఎక్కువ బంగారు పతకాలు సాధిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇది నిజంగా గర్వించే విషయమన్నారు. మన కుమార్తెల సామార్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని కొనియాడారు. 

సాంకేతిక విద్యను అభ్యసించేందుకు వారికి మనం ప్రోత్సాహం అందించాలని రాష్ట్రపతి సూచించారు. సైన్స్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ను అభ్యసించాల్సిన అవసరం దేశానికి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేశ్‌లాల్‌, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నాబా కిషోర్‌ దాస్‌, ఎంపీ జుయెల్‌ ఓరం కూడా పాల్గొన్నారు.