ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కరోనా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నది గుర్తించాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు.

కాగా మహారాష్ట్రలో కొన్ని రోజులుగా దాదాపు రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే.

ముంబైలో కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ ర్యాపిడ్ కరోనా టెస్టులు చేసేందుకు ముంబై మునిసిపల్ కార్పొరేషన్  నిర్ణయించింది. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో ఈ టెస్టులు చేపట్టనుంది. 

ఇందుకోసం అధికారులు..వివిధ సమయంలో అక్కడున్న ప్రజల్లో కొందరిని అప్పటికప్పుడు ఎంపిక చేసి..కరోనా టెస్టులు నిర్వహిస్తారు. దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేకుండా ర్యాండమ్‌గా ఈ పరిక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. పరీక్షలు చేయించుకునేవారి నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులూ అధికారులు తీసోకవాల్సిన అవసరం ఉండదని కార్పొరేషన్ స్పష్టం చేసింది.

అంతేకాకుండా.. ప్రజలు ఈ టెస్టులను తిరస్కరించకూడదని కూడా స్పష్టం చేసింది. కరోనా పరీక్ష చేయించుకునేందుకు నిరాకరిస్తున్న వారిపై ఎమిడెమిక్ యాక్ట్ 1897కింద చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. 

ముంబైలో కరోనా రోగుల సంఖ్య రోజరోజుకు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి 75 వేల బెడ్లను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు  బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)   ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 27 వేల బెడ్లలో 50 శాతం ఖాళీగానే ఉన్నాయని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

జనవరిలో రోజుకు 500 కంటే తక్కువ కేసులే నమోదయినా,  ఫిబ్రవరి నుంచి ఆకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరిగిపోవడం మొదలైంది. ప్రతీరోజు సుమారు 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

కేసులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ నాగ్‌పూర్ జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ‘‘కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయి. కూరగాయలు, ఇతర నిత్యావసరాల దుకాణాలను సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తాం..’’ అని మంత్రి నితిన్ రావత్ పేర్కొన్నారు.