మిత్ర దేశాల ప్రయోజనాలకు అమెరికా పెద్ద పీట 

మిత్ర దేశాల ప్రయోజనాలకు అమెరికా పెద్ద పీట 

అమెరికా తన మిత్ర దేశాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. భారత దేశంతో దూరదృష్టిగల సమగ్ర రక్షణ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం మన దేశానికి వచ్చిన లాయిడ్ శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.  అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

మిత్ర దేశాలు, భాగస్వాముల పట్ల అమెరికాకుగల నిబద్ధతపై బైడెన్-హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన సందేశాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానని లాయిడ్ తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత దేశంతో సమగ్రమైన, దూరదృష్టిగల భాగస్వామ్యానికి అమెరికా కట్టుబడి ఉన్నట్లు మరోసారి చెప్తున్నానని స్పష్టం చేశారు. 

ఈ వైఖరి ఈ ప్రాంతం విషయంలో అత్యంత ప్రధానమైనదని తెలిపారు. భారత్ – అమెరికా  సంబంధాలు స్వేచ్ఛాయుత, అడ్డంకులు లేని ఇండో-పసిఫిక్ రీజియన్‌కు బాటలు పరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలను లాయిడ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత సముద్రయానం, స్వేచ్ఛాయుత ఆకాశయానం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అడ్డంకులు లేని న్యాయమైన వాణిజ్యాలను భారత దేశం సమర్థిస్తుందని మోదీ చెప్పారని పేర్కొన్నారు. మోదీ మాటలు ప్రాంతీయ భద్రత కోసం ఇరు దేశాల ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని చెప్పారు. 

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రక్షణ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, రక్షణ రంగంలో నూతన అంశాల్లో సహకరించుకోవడం, పరస్పర లాజిస్టిక్స్ సహకారం, ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవడంపై ప్రధాన దృష్టితో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌ను లాయిడ్ ఆస్టిన్ ఎల్బో బంప్‌‌తో (స్నేహపూర్వకంగా మోచేతులు తాకించి) పలుకరించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ సమావేశమయ్యారు.