బీజేపీ ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ ఆత్మ‌హ‌త్య 

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శ‌ర్మ ఇవాళ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.  ఆయ‌న వ‌య‌సు 62 ఏళ్లు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  2014లో ఆయ‌న తొలిసారి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు.  

విదేశాంగ వ్య‌వ‌హారాలకు చెందిన స్టాండింగ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.  ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ‌కు భార్య‌, ముగ్గురు కుమారులు ఉన్నారు.  ఎంపీ స్వ‌రూప్ శ‌ర్మ గ‌త కొన్నాళ్ల నుంచి తీవ్ర మాన‌సిక‌క్షోభ‌లో ఉన్నారు. ఆరు నెల‌ల నుంచి డిప్రెష‌న్ చికిత్స తీసుకుంటున్నారు.  

ఢిల్లీలో ప్ర‌స్తుతం ఆయ‌న ఒంటరిగా ఉంటున్నారు. ఆయ‌న భార్య .. చార్‌థామ్ యాత్ర‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  శ‌ర్మ‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీస‌ర్ ప్ర‌స్తుతం మండీలో ఉన్నారు.  

ఉదయం ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్ చేయగా శర్మ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. నివాసానికి వెళ్లిన పోలీసులు, గది తలుపులు బద్దలుకొట్టగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఎంపీ స్వ‌రూప్ ఆత్మ‌హ‌త్య‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

లోక్‌స‌భ ఇవాళ బీజేపీ ఎంపీ స్వ‌రూప్ శ‌ర్మ మృతికి నివాళి అర్పించింది.  స్పీక‌ర్ ఓం బిర్లా ఈ నేప‌థ్యంలో నివాళి సందేశం వినిపించారు.  రామ్ స్వ‌రూప్ శ‌ర్మ మృతికి నివాళిగా స‌భ్యులు కాసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు.  ఆ త‌ర్వాత స్పీక‌ర్ బిర్లా.. స‌భ‌ను రెండు గంట‌ల పాటు వాయిదా వేశారు.