జర్నలిస్ట్ లను కత్తితో పొడిస్తే ట్విట్టర్ పిట్ట స్పందించలేదే!

జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదు? అని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. మంత్రులు కెటీఆర్, హరీష్‌రావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఆంధ్రా ప్రాంత కార్పొరేట్ కంపెనీలు,  పట్టభద్రుల ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌పై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడటం హ్యాస్యాస్పదంగా ఉందని దయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంపై విమర్శలు చేయటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. హరీష్‌రావు సిద్దిపేటకు మాత్రమే ఆర్థికమంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికా? అని రఘునందనరావు ప్రశ్నించారు. 

ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించి సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే.. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మాట్లాడరు? అని రఘునందనరావు  ప్రశ్నించారు.  

దుబ్బాక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయని రఘునందనరావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీజేపీకి సమయం ఇవ్వకపోతే స్పీకర్‌ను కూడా నిలదీస్తామని హెచ్చరించారు. గాంధేయ మార్గంలోనే తమ హక్కును సాధిస్తామని స్పష్టం చేశారు. 

కేంద్రం చేసిన సాయంపై సభలో చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలకు రఘునందనరావు సవాల్ విసిరారు. మందబలంతో సభను నడిపితే కుదరదని స్పష్టం చేశారు. నిరుద్యోగభృతిపై సభలో ప్రభుత్వ వైఖరీని ఎండగడతామని వెల్లడించాయిరు. బైంసాలో గత ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఉంటే శాంతి భద్రతలు బాగుండేవని రఘునందనరావు తెలిపారు. 

 మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు.  కేసీఆర్ గజ్వేల్‌కు మాత్రమే సీఎం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో జరుగుతోన్న అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని స్పష్టం చేశారు. 
 
హైదరాబాద్‌ ఆదాయాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ తరలించుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. అసలు కేటీఆర్‌ కేంద్రాన్ని విమర్శించే ముందు ఏడేళ్లలో ఏం చేశారో చెప్పాలని  ప్రశ్నించారు. హైదరాబాద్‌లో భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడిపేవారు కూడా.. బీజేపీని విమర్శించడం హాస్యాస్పదమని రఘునందన్ ఎద్దేవా చేశారు.