ఎమ్మెల్సీ ఎన్నికల పోరు బీజేపీ– టీఆర్‌ఎస్‌ మధ్యే

ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధంపోరాటం బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్యేనని, ఈ ఎన్నికలే సమస్యలన్నీ పరిష్కరిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 

ఉద్యోగులకు పీఆర్సీ, యువతకు కొలువులు, నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీకి టీఆర్‌ఎ్‌సను ఓడించడమే ఏకైక పరిష్కారమని చెప్పారు. తమకు ఓటు వేయకపోతే అంతు చూస్తామని ఓ మంత్రి బెదిరిస్తున్నారని పేర్కొంటూ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆ బెదిరింపులకు భయపడరని భరోసా వ్యక్తం చేశారు. 

తనకు సీఎం పదవి చెప్పుతో సమానమని కేసీఆర్‌ అన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు ఓటు వేస్తే అది సీఎం కేసీఆర్‌ చెప్పుకు వేసినట్టేనని సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎంవోలో అవినీతి జరుగుతోందని పీఆర్‌వో విజయ్‌కుమార్‌పై వేటు వేశారని, ముఖ్యమంత్రికి ఆ విషయం ఇంత కాలానికి అవినీతి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. 

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అంతకుముందు పట్టణంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.

ఇలా ఉండగా, మంత్రి నిరంజన్‌రెడ్డి ఉద్యోగులను బెదిరింపు ధోరణిలో హెచ్చరించడం తగదని, ఆయన వారికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.  ఆయన మహబూబ్‌నగర్‌లో ఆయన న్యాయవాదులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఉద్యోగులు ప్రతిపక్షాలకు ఓట్లేస్తే ఇంకా మూడేళ్లు తామే అధికారంలో ఉంటామని, పనుల కోసం తమ వద్దకే రావాల్సి ఉంటుందని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోడ్‌ ఉల్లంఘించారని సీఈఓకు ఫిర్యాదు చేశారు. 

‘‘మీ మామ ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేయలేదా?’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్  ఇంద్రసేనారెడ్డి, మంత్రి హరీశ్‌ను ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీచేశారంటూ మంత్రి హరీశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇంద్రసేనారెడ్డి పైవిధంగా స్పందించారు.