ఫాస్టాగ్‌లతో  రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా  

దేశ‌వ్యాప్తంగా ప్ర‌వేశ‌పెట్టిన ఫాస్టాగ్‌ల వ‌ల్ల భారీగా స‌మ‌యం, ఇంధ‌నం ఆదా అవుతోంద‌ని కేంద్ర హైవేలు, రోడ్డు ర‌వాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. వీటి వ‌ల్ల టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర వేచి చూసే స‌గ‌టు స‌మ‌యం గ‌తేడాది 464 సెక‌న్లు ఉండ‌గా.. ఈ ఏడాది 150 సెక‌న్ల‌కు త‌గ్గింద‌ని తెలిపారు.

దీని కార‌ణంగా రూ.20 వేల కోట్ల ఇంధ‌నం ఆదా అవుతుంద‌ని గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర వాహనాల వేచి చూసే స‌మ‌యం, ట్రాఫిక్ క్యూను లైవ్‌లో చూసే మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌ను సోమ‌వారం ఆయ‌న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఫాస్టాగ్‌ల వ‌ల్ల నెల‌కు విడుద‌ల అయ్యే కార్బ‌న్‌డైఆక్సైడ్ ఉద్గారాలు కూడా 5 ల‌క్ష‌ల ట‌న్నులు త‌గ్గుతాయ‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా హైవేల‌పై ఉన్న టోల్‌ప్లాజాల ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మాచారాన్ని ప్ర‌తి రోజూ ఈ వ్య‌వ‌స్థ రికార్డు చేయ‌నుంది. 

గ‌త నెల 15 నుంచి దేశ‌వ్యాప్తంగా ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ రికార్డుల ప్ర‌కారం.. టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర న‌గ‌దు ద్వారా చెల్లించడానికి స‌గ‌టు స‌మ‌యం 40 సెక‌న్లు కాగా.. ఫాస్టాగ్‌తో అది 5 సెక‌న్ల‌కు త‌గ్గిపోనుంది. 

ఈ కొత్త వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయ‌డం ద్వారా కేంద్రానికి కూడా అద‌నంగా రూ.10 వేల కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.