ప్రజలను పీడించుకుతింటున్న కేసీఆర్ కు భయం పుట్టిస్తా

బీజేపీ నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తోంది, ప్రభుత్వ దాడులకు భయపడేదే లేదు, ప్రజలను పీడించుకుతింటున్న కేసీఆర్ కు భయం పుట్టిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. గుర్రపుపాడులో గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారని..ఇందుకేనా తెలంగాణ సాధించింది అని గిరిజనులు బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ మోర్చా పథాధికారుల సమావేశంలో  మాట్లాడుతూ.. రాచరిక పాలనతో ప్రజలను పీడించుకుతింటున్నారని ఆరోపించారు. నిన్న గిరిజనులు, పేదలపై ఇష్టారీతిన దాడులు చేశారని, సహించలేక తెలంగాణ లోని పేదలంతా బీజేపీవైపు చూస్తున్నారు, వారికి న్యాయం చేయాలనేది బీజేపీ తపన అని ఆయన తెలిపారు.
పాలకులకు కనువిప్పు కలగాలంటే దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలను వచ్చే ఎన్నికల్లో పునరావృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పును అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని, పదవీ విరమణ పొందిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పనిచేస్తున్న ఐపీఎస్ లను అవమానిస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
అనుభవం లేదనే కారణంతో పదవీ విరమణ చేసినోళ్లకు, తనకు దగ్గరగా ఉండేటోళ్లకు కీలక బాధ్యతలు ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు అనే ఇంటెలిజెన్స్ అధికారి కేసీఆర్ కు  తొత్తులా వ్యవహరిస్తున్నాడు, గిరిజనులపై దాడులు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు.
బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షడికి ఏమైనా జరిగితే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. రెండేళ్లపాటు వ్యాపారాలు, ఉద్యోగాలు మాని పేద ప్రజల సర్కార్ వచ్చే వరకు కృషి చేయాలని, కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ రెండు నెలలు చర్చలు నడిచేలా చేసి ప్రజల దృష్టి మారల్చారని విమర్శించారు.
కోట్లు ఖర్చు చేసినా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్ఎస్ కు ఓటు వేయరని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న షెడ్ కు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కొన్ని కుల సంఘాల నేతలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని,  అందుకే కులాలను ఏకం చేసే బాధ్యత బిసి మోర్చా నాయకులు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.