ఢిల్లీ అల్లర్ల సూత్రదారుడు సిద్దూ అరెస్ట్ 

కిసాన్ ర్యాలీలో అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైన పంజాబీ న‌టుడు దీప్ సిద్ధూను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.  ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన స్పెష‌ల్ సెల్ అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ది.  ఆ శాఖ ఇవాళ దీప్ సిద్దూ ఫోటోల‌ను రిలీజ్ చేసింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోట‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో దీప్ సిద్ధూ ప్ర‌ధాన నిందితుడు. ఆ రోజున రైతు ర్యాలీ హింసాత్మ‌కంగా మారడానికి కూడా ఇత‌నే కార‌ణ‌మ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  

ఎర్ర‌కోట వైపు దూసుకువ‌చ్చిన రైతులు.. అక్క‌డ జెండాల‌ను కూడా పాతిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ప‌రారీలో ఉన్న దీప్ సిద్ధూ కోసం పోలీసులు గాలించారు. అత‌నిపై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు.

దీప్ సిద్దూ త‌రుచూ ఓ మ‌హిళా స్నేహితురాలితో ట‌చ్‌లో ఉండేవారు. కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెకు అత‌ను ఎప్పుడూ వీడియోల‌ను పంపేవాడ‌ని పోలీసులు విచార‌ణ‌లో తేల్చారు.  అయితే దీప్ పంపిన ఫోటోలు, వీడియోల‌ను.. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ మ‌హిళ అప్‌లోడ్ చేసేద‌ని పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  చండీఘ‌డ్ – అంబాల మ‌ధ్య ఉన్న జిరాక్‌పూర్‌లో దీప్ సిద్దూను అరెస్టు చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సిద్ధూతో పాటు మ‌రో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్ర‌క‌టించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోటపై సిక్కు జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధూ మిగ‌తా వారిని ప్రేరేపించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆ ఘ‌ట‌న జ‌రిగినప్ప‌టి నుంచి నిన్న‌టి వ‌ర‌కు సిద్దూ ఆచూకీ లేద‌రు. 

సిద్దూతో పాటు జెండా ఎగుర‌వేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. ఇక జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు.  కిసాన్ ర్యాలీలో అల్ల‌ర్లకు కార‌ణ‌మైన 12 మంది ముఖ‌చిత్రాల‌ను ఇటీవ‌ల ఢిల్లీ పోలీసులు విడుద‌ల చేశారు.

ఈ 12 మంది క‌ర్ర‌లు ప‌ట్టుకుని దాడులు చేసిన‌ట్లు వీడియోల్లో క‌నిపించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల‌పై కూడా దాడులు చేసింది వీరేన‌ని తేలింద‌న్నారు. కిసాన్ ర్యాలీ అల్ల‌ర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు న‌మోదు చేయ‌గా, 122 మందిని అరెస్టు చేశారు. ప‌లు రైతు సంఘాల నాయ‌కుల పేర్లు కూడా వివిధ కేసుల్లో న‌మోదు అయ్యాయి.