ఎంపీలాడ్స్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి   

సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పార్లమెంట్ సభ్యులకు  సూచించారు. 

ఉపరాష్ట్రపతి నివాసంలో పార్లమెంటు సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి ప్రతిపాదనల ఆధారంగా, 2006-2018 మధ్యలో 12 ఏళ్ల పాటు జరిగిన వైద్య, విద్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ డాక్టర్ కె.ఎన్. భండారీ రాసిన ‘పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

ఎంపీలు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎంపీలాడ్స్ సాధికారత కల్పిస్తాయన్న ఉపరాష్ట్రపతి, 1993లో ఎంపీలాడ్స్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 19కోట్ల 47వేల పనులు పూర్తయ్యాయని, దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆస్తుల కల్పనకు ఈ పథకం ఉపయోగపడిందన పేర్కొన్నారు. 

ఎంపీలాడ్స్ నిధులతో నడిచే కార్యక్రమాల్లో ఆలస్యాన్ని, ఇతర సమస్యలను ప్రస్తావించిన ఆయన, ప్రజలకు పథకాల ఫలితాలను అందించడంలో స్థానిక అధికారులు కూడా కలసిరావాలని పిలుపునిచ్చారు. పనుల గుర్తింపులో వారి పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. 

పార్లమెంటు సభ్యులు, స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎంపీ లాడ్స్ ను సరైన సమయంలో సరైన పద్ధతిలో సద్వినియోగం చేయడం ద్వారా ప్రజలకు వాటి ఫలాలను అందించేందుకు కృషిజరగాలని ఆకాంక్షించారు. ఎంపీలాడ్స్ నిధుల సద్వినియోగంలో పాదర్శకతకోసం థర్డ్ పార్టీ పర్యవేక్షణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. 

 సరైన సమయంలో నిధుల సద్వినియోగం, ఈ పథకం పరిధిలో చేపట్టే కార్యక్రమాల నాణ్యత పెరగటం, నిర్దిష్ట సమయంలో ఈ కార్యక్రమాలు పూర్తవడం తదితర అంశాలపై పలు పార్లమెంటరీ కమిటీలు చేసిన సూచనలను కూడా ప్రస్తావించారు. ఇందుకోసం ఎంపీలు, స్థానిక అధికారుల సమన్వయం తప్పనిసరని తెలిపారు. 

ఓ న్యాయవాదిగా, ఓ పార్లమెంటేరియన్‌గా, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తో పాటు వివిధ కమిటీల్లో  సభ్యుడిగా డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, ఎంపీల్యాడ్స్ ను సద్వినియోగం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయడంలో వచ్చే సంతృప్తిని ఈ పుస్తకం వెల్లడిస్తోందని చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు అందించడం కీలకమైన అంశమని ఈ దిశగా  సింఘ్వీ పనిచేయడం మిగిలిన ఎంపీలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. 

ప్రభుత్వాలు కూడా ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి విద్య, వైద్య రంగాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నఉపరాష్ట్రపతి, ఎంపీలు సత్ప్రవర్తనను కనబరుస్తూ, నిరంతరం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ నడతతో ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయం కావాలని సూచించారు.

పార్లమెంటుకు హాజరవడంలో క్రమశిక్షణ పాటించడంతో పాటు చక్కని సూచనలు చేయడంలో చొరవతీసుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కంటే ప్రజలకు సాధికారత కల్పించడం, వారి నైపుణ్యాన్ని వృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.