రిపబ్లిక్‌ డే ప్రత్యేక అతిథులుగా ఇద్దరు బాలికలు 

రేపు జరిగే గణతంత్ర దినోత్సవానికి ఇద్దరు బాలికలు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ఇద్దరు బాలికలు ప్రధాని నరేంద్ర  మోదీతో కలిసి బాక్సును పంచుకోనుండటం విశేషం. వీరు జనవరి 26 న రాజ్‌పథ్‌లో జరిగే కవాతులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కనిపించనున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ప్రధాని సత్కరించనున్నారు. ఒకరు నమ్య జోషి కాగా, మరొకరు గుర్వీన్ కౌర్. ఈ ఇద్దరూ పంజాబ్‌లోని లూధియానా జిల్లాకు చెందినవారు. ఈ అమ్మాయిలు సాధించిన పనితో వారి కుటుంబసభ్యులతోపాటు యావత్‌ దేశం గర్విస్తోంది.

14 ఏండ్ల వయసున్న నమ్య జోషి కంప్యూటర్ రంగంలో కొత్తదనాన్ని కనుగొనేందుకు సదా ముందుటుంది. మైండ్‌ క్రాఫ్ట్‌లో 100 కు పైగా అధ్యాయాలను నమ్య జోషి రచించారు. అదేవిధంగా ఇప్పటివరకు దాదాపు వేయి మందికిపైగా అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 

యూట్యూబ్‌ ఛానల్‌లో నవ్యకు చెందిన 169 వీడియోపాఠాలు ఉన్నాయి. నవ్య జోషి కృషిని గుర్తించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల ఎంతగానో ప్రశంసించారు. రేపటి గణతంత్ర దినోత్సవంలో నమ్య జోషిని ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించనున్నారు. 

ప్రస్తుతం సత్పాల్ మిట్టల్ పాఠశాలలో 8 వ చదువుతున్న నమ్య జోషి తల్లి మోనికా జోషి అదే పాఠశాలలో ఐటీ విభాగానికి హెడ్‌గా ఉన్నారు. తండ్రి కునాల్ జోషికి ఐటీ వ్యాపారంలో ఉన్నారు. ఇంట్లో ఐటీ, కంప్యూటర్ టెక్నాలజీ వాతావరణం కారణంగా చిన్నప్పటి నుంచీ కంప్యూటర్లపై నమ్యకు ఆసక్తి కలిగింది. 

మోడల్ టౌన్ ఎక్స్‌టెన్షన్ నివాసించే గుర్వీన్‌ కౌర్‌  బీఆర్ఎస్ నగర్‌లోని సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్‌లో 12 వ తరగతి చదివారు. ఇటీవల వెలువరించిన సీబీఎస్‌ఈ ఫలితాల్లో గుర్వీన్‌ కౌర్‌ రెండో స్థానం సాధించారు. ఈ ఘనత కారణంగా గుర్వీన్ కౌర్‌ ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాని బాక్స్‌లో కూర్చునే అవకాశం పొందారు. గుర్వీన్ కౌర్ తండ్రి గురీందర్ పాల్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది. తల్లి బల్విందర్ కౌర్ డైటీషియన్.