29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు  

ఈనెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కోవిడ్‌ దృష్ట్యా  ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశ మవుతాయని వెల్లడించారు. 
 
సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లలో సమావేశాలు కొనసాగుతాయని ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని చెప్పారు. క్వశ్చన్‌ అవర్‌ యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక సమావేశానికి వచ్చే ఎంపిలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  

ఎంపిల కుటుంబ సభ్యులకు, పిఎలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని, ఇందుకోసం ఈ నెల 27, 28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. కాగా, అదేరోజున బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు కూడా సమావేశం కానున్నాయి.  ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తేనున్నారు.

కాగా, పార్లమెంట్‌ ఆవరణలో ఉన్నక్యాంటీన్లలో భోజనంపై ఇచ్చే రాయితీని ఎత్తేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు. రాయితీ తొలగింపుతో ఏటా రూ.8 కోట్లకు పైగా ఆదా అవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్లను ఉత్తర రైల్వే నిర్వహించగా, ఇకపై ఐటిడిసి నడుపుతుందని స్పీకర్‌ చెప్పారు.