రామమందిరంకు అక్షయ్, దిగ్విజయ్ విరాళం 

అయోధ్య రామమందిర నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనంతుగా విరాళాన్ని ఇచ్చినట్లు ప్రకటించాడు. అంతేకాకుండా దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి శక్తివంచన లేకుండా విరాళాలివ్వాలని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు అక్షయ్ కుమార్ ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వీడియోను ‘జై శ్రీరాం’ అనే నినాదంతో అక్షయ్ పూర్తి చేశాడు. అయితే తాను ఎంత మొత్తంలో విరాళం ఇచ్చాడనే విషయాన్ని మాత్రం అక్షయ్ కుమర్ ప్రకటించలేదు.

 కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్ సింగ్ కూడా అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణం కోసం త‌న‌వంతుగా రూ 1,11,111 విరాళం స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ్ క్షేత్ర ట్ర‌స్టుకు విరాళం అంద‌జేశారు.
 
ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విదేశాల నుంచి నిధులు సేకరించేందుకు ట్రస్టుకు అనుమతి లేదని, పూర్తి దేశీ నిధులతోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. దాదాపు 36 నెలల నుంచి 40 నెలల సమయంలో రామమందిరం ఏర్పాటు పూర్తవుతుందని, సాధారణ ప్రజలు ఇచ్చే విరాళాల సేకరణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 
 
ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం వచ్చినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులతో పాటు సినీ నటులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.  ఇటీవ‌ల సినీ నటి ప్ర‌ణీత త‌న‌వంతుగా ల‌క్ష రూపాయాల విరాళం అందించ‌గా, ఇప్పుడు అక్ష‌య్ కూడా విరాళం ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించారు. 
 
ఇదిలా ఉంటే కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ కోసం అక్షయ్ ఏకంగా రూ.25 కోట్ల మేర విరాళం ప్రకటించారు. ఈ విరాళం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. దీంతో ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణానికి కూడా అక్షయ్ భారీగానే విరాళం ఇచ్చి ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.