తొలిరోజు 1.9 లక్షల మందికి వ్యాక్సినేషన్  

కరోనా వైరస్‌కు కట్టడి చేసేందుకు  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన ప్రపంచంలోనే  అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. 1,91,181 మంది వాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కరు కూడా ఆసుపత్రిపాలైనట్టు సమాచారం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 3,351 సెషన్లలో 16,755 మంది వ్యాక్సినేటర్లు పాల్గొన్నట్టు తెలిపింది.  సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ‘కోవిషీల్డ్’, భారత్ బయోటెక్ అభివృద్ధి పరచిన కొవాక్సిన్‌ను 12 రాష్ట్రాలుకు సరఫరా చేసినట్టు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

వ్యాక్సినేషన్ తొలి రోజు కావడంతో కొన్ని సెషన్ సైట్లలో వ్యాక్సినేషన్ వేయించుకునే వారి జాబితా అప్‌లోడ్‌లో జాప్యం వంటివి చోటు చేసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సాయంత్రం 5.30 గంటల వరకూ 1,65,714 మంది వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తొలుత ప్రకటించింది.

తొలిరోజు టీకా తీసుకున్నవారిలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సిఇఒ అదర్‌పూనావాలా కూడా ఉన్నారు. తాను టీకా తీసుకున్న వీడియోను పూనావాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ చేపట్టిన టీకాల కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని పూనావాలా ట్విట్ చేశారు. 

ఈ చారిత్రక ఘట్టంలో తమ కంపెనీ తయారు చేసిన కోవీషీల్డ్ భాగాస్వామ్యం పొందడం తమకు గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. తమ టీకా సురక్షితం, సమర్థవంతమని స్పష్టం చేయడానికే ఆరోగ్య కార్యకర్తలతోపాటు తాను కూడా టీకా తీసుకున్నానని ఆయన తెలిపారు. 

తొలిరోజున తెలంగాణలో 3600 మందికి, ఆంధ్రప్రదేశ్లో 16,963 మందికి, బీహార్‌లో 16,401 మందికి, మహారాష్ట్రలో 15,727 మందికి, అసోంలో 2721 మందికి, ఢిల్లీలో 3403 మందికి, హర్యానాలో 4656 మందికి, హిమాచల్ ప్రదేశ్‌లో 1408 మందికి, జమ్మూ కశ్మీర్‌లో1954 మందికి, చత్తీస్‌గడ్‌లో 4985 మందికి, అరుణాచల్ ప్రదేశ్‌లో 743 మందికి, యుపిలో 15,975 మందికి, పశ్చిమ బెంగాల్‌లో 9678 మందికి, ఉత్తరాఖండ్‌లో 2226 మందికి, రాజస్థాన్‌లో 9279 మందికి, పంజాబ్‌లో టీకాలు తొలివిడతగా పడ్డాయి. ఇప్పటి తొలిరోజు వ్యాక్సినేషన్‌లోభాగంగా తొలిటీకాను పారిశుద్ధ కార్మికుడు మనీష్‌కుమార్ పొందారు.