డిజిటల్‌ రుణ సంస్థలపై అధ్యయనం  

ఆన్‌లైన్‌లో రుణాలు అందజేస్తున్న మొబైల్‌ యాప్‌ల దారుణాలు, వాటి వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. డిజిటల్‌ రుణ సంస్థలపై అధ్యయనం జరిపేందుకు ఓ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. 

ఈ సంస్థలపై చేపట్టాల్సిన నియంత్రణ చర్యలతోపాటు డిజిటల్‌ రుణ వితరణను సక్రమ రీతిలో అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ వర్కింగ్‌ గ్రూపు సూచిస్తుంది. డిజిటల్‌ పద్ధతుల ద్వారా ఆర్థిక రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడం స్వాగతనీయమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. 

దీన్ని సమన్వయం చేసి వినియోగదారుల భద్రతతోపాటు డాటా భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు, విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరమున్నది. అందుకు తగినట్లుగా నియమ నిబంధనలను రూపొందించాలని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

డిజిటల్‌ రుణాలను అందజేసే మొబైల్‌ యాప్స్‌/ప్లాట్‌ఫామ్స్‌ వల్ల గత కొంత కాలం నుంచి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని నిరోధించేందుకే వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.