రెండో భార్య సోదరిపై ‘మహా’మంత్రి అత్యాచారం?

మహారాష్ట్రలో ఓ మంత్రిపై అత్యాచార ఆరోపణలు వెలువడ్డాయి. రాష్ట్ర సామాజిక న్యాయ మంత్రి ధనంజయ్ ముండే తనను రేప్ చేశాడని ఓ మహిళ ఆరోపించింది. పోలీసులు మంత్రిపై ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని ఈ మహిళ తెలిపింది. 

ఎన్‌సిపి నేత అయిన ముండే ఈ మహిళ ఆరోపణలను ఖండించారు. ఫిర్యాదీ ఆమె సోదరితో కలిసి తనను బ్లాక్‌మొయిల్ చేస్తోందని విమర్శించారు. అయితే తనకు ఫిర్యాదీ సోదరితో సంబంధముందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగారని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. మంత్రిపై రేప్ ఆరోపణ చేసిన 37 ఏళ్ల మహిళ తన బాధను తెలియచేసుకుంది.

మంత్రి తనపై పలుసార్లు అత్యాచారం జరిపాడని, ఇది జరిగి కూడా 14 ఏండ్లు గడిచిందని, అయితే తాను పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని, దీనితో ఈ నెల 10వ తేదీన ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ పంపించానని తెలిపారు. న్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒషివారా పోలీసు అధికారులు తిరస్కరిస్తూ వచ్చారని పేర్కొన్నారు. 

ప్రస్తుత అంశంపై మంత్రి ముండే స్పందిస్తూ ఇదంతా కూడా తనను బ్లాక్‌మొయిల్ చేయడానికే అని ఆరోపించారు. తనకు ఆమె సోదరితో సంబంధమున్న విషయం, పిల్లలు పుట్టిన వైనం ఇదంతా కూడా తన భార్యకు పిల్లలకు తెలుసునని, ఇందులో ఎటువంటి దాపరికం లేదని ఈ మంత్రి ఓ ప్రకటన వెలువరించారు.