బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

జనగాం నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ పట్టణంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి, బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలను మునిసిపల్ అధికారులు తొలగించారు.  దీంతో బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 
 
మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగాయి. దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. 
 
తాము చెప్పేది వినాలని బీజేపీ నాయకులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం పోలీసులు చితకబాదారు. ఎలాంటి గొడవ జరగకపోయినా  సీఐ మల్లేశ్  ఒక్కసారిగా రెచ్చిపోయి బీజేపీ, బీజవైఎం నాయకులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ గాయపడ్డారు. అధికారపార్టీకి వంతపాడుతున్న కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు.
జనగామలో బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ కి పాల్పడిన  సిఐ మల్లేష్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై విచక్షణ రహితంగా లాఠీఛార్జ్ చేయడం అమానుషమని తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికార పార్టీకి  ఏజెంట్లుగా మారి విధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. .

పోలీసులు సమన్యాయం పాటించే వారు అయితే టిఆర్ ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచి, బీజేపీ ఫ్లెక్సీలు చించిన వారిపై కేసులు పెట్టమని సంజయ్ సవాల్ చేశారు. రాష్ట్రంలో స్వామివివేకానంద ఉత్సవాలు జరపడం ఏమైనా దేశ ద్రోహమా  ? ఉత్సవాలు జరపడం రాష్ట్రంలో ఏమైనా నిషేధం ఉందా.. జరుపుకొనివ్వరా.? అని సంజయ్ ప్రశ్నించారు.

పరుషాపదజలం వాడి లాఠీఛార్జ్ చేసిన సిఐ మల్లేష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేసారు. అధికారులు స్పందించకపోతే పోలీసుల తీరుపై ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.