మునిసిపల్ శాఖ మంత్రి, తన కుమారుడు కేటీఆర్ను సీఎం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకో 15 రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం చేస్తున్నారని.. కానీ అది జరగదని స్పష్టం చేశారు.
మంత్రి పదవి రాకపోతే పార్టీ పెడతామని ముగ్గురు, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని., కేసీఆరే వాళ్లతో అలా మాట్లాడిస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్లు కొత్త పార్టీ పెడితే ప్రభుత్వం పడిపోతుందని, అందువల్ల సీఎం అయ్యేందుకు కొద్దిరోజులు ఆగాలని కుమారుడికి కేసీఆర్ చెబుతారని జోస్యం చెప్పారు.
ఇంతకుముందు సంతో్షరావు పేరు చెప్పి ఆపారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పేరు చెప్పి ఆపుతున్నారని సంజయ్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐ నుంచి ఉన్నతాధికారి వరకు సీఎం, సీఎంవో పేరు చెప్పి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.
‘కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభ్యర్థిస్తే ఆయన రూ.53 కోట్లు మంజూరు చేశారు. ఈ పనికి టెండర్లే తెరవలేదు. కానీ పనులు మాత్రం ప్రారంభించారు. ఆ పని కాంట్రాక్టు చేసిన వ్యక్తికే వస్తుందని ఎలా తెలుస్తుంది? అంటూ సంజయ్ ప్రశ్నించారు.
అంటే, ఒక ప్లాన్ ప్రకారం, డమ్మీ వ్యక్తితో నామినేషన్ వేయిస్తారు. ఈలోగా అసలు వ్యక్తి వస్తాడు. అధికారులు ఆయనకే కొమ్ముకాస్తారు. ఏఈ నుంచి ఈఎన్సీ వరకు కాంట్రాక్టర్కే మద్దతు పలుకుతారని సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు అవినీతికి వ్యాక్సిన్ కనిపెట్టారని, దానిని ఫాంహౌస్, ప్రగతి భవన్పైన ప్రయోగిస్తామని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు సంస్కారంగా మాట్లాడాలని సంజయ్ హితవు చెప్పారు.
తన కుమారుడు లేదా కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ఛుగ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను సీఎంగా చేయడానికే ఓట్లు వేశారని గుర్తు చేశారు.
More Stories
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా