ఇండోర్ లో పట్టుబడిన హైదరాబాద్ డ్రగ్స్ 

హైదరాబాద్ నగరం దేశంలోనే కీలక మాదక ద్రవ్యాల తయారీ, రవాణా, విక్రయ కేంద్రంగా కొనసాగుతున్నట్లు పలు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో సినీ రంగానికి చెందిన పలువురిపై దాడులు జరిపి, వారిని విచారించి, ఆ తర్వాత వారితో ఒక అవగహనకు రావడంతో ఆ కేసును నీరు కార్చడం తెలిసిందే. 
 
తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పట్టుబడిన రూ 70 కోట్ల విలువైన డ్రగ్స్ హైదరాబాద్ లో తయారైనట్లు తేలడం కలకలం రేపుతున్నది. ఇండోర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ (ఎస్వోటీ) రంగంలోకి దిగాయి.
ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ను హైదరాబాద్‌ శివార్లలోని మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో తయారు చేశారని తేలడంతో  ఆ కోవలోని కంపెనీలను జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా  ఇండోర్‌ పోలీసులు అరెస్టు చేసిన వేదప్రకాశ్‌ వ్యాస్‌కు చెందిన ఫార్మా కంపెనీతోపాటు,  ఇతర కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఇండోర్‌ పోలీసులు అరెస్టు చేసిన వేదప్రకాశ్‌ వ్యాస్‌ రాజస్థాన్‌కు చెందినవాడు. 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి, కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో అరిస్టాన్‌ ఫార్మా నోవెటెక్‌ కంపెనీని స్థాపించాడు. బల్క్‌డ్రగ్స్‌ తయారీ రంగంలో స్థిరపడ్డాడు.

మాదక ద్రవ్యాల తయారీ ద్వారా తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో  ఎండీఎంఏ(మిథైల్‌ ఎన్డిమాక్స్‌ మెథా పెటమిన్‌) తయారీని ప్రారంభించాడు. డ్రగ్స్‌ తయారీకి మూతపడ్డ ఫార్మా కంపెనీలను ఎంచుకునేవాడు. తయారీ మొదలు.. సరఫరా దాకా ఎక్కడా రంగంలో ఉండేవాడు కాదు.  ఇప్పటి వరకు వందల కోట్లు విలువ చేసే ఎండీఎంఏను దేశ విదేశాల్లోని స్మగ్లర్లకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు.

ఎస్వోటీ పోలీసులు నోవెటెక్‌లో జరిపిన తనిఖీల్లో ఎక్కడా డ్రగ్స్‌ జాడ లభ్యం కాలేదు. దీంతో  రాచకొండ, సైబరాబాద్‌ పరిధుల్లోని కొంపల్లి, చర్లపల్లి, నాచారం, ఘట్కేసర్‌, చౌటుప్పల్‌, బీబీనగర్‌ ప్రాంతాల్లోని మూత పడ్డ ఫార్మా కంపెనీలను జల్లెడ పడుతున్నారు.  వేదప్రకాశ్‌ అరెస్టుకు ముందు అతడి ఫోన్‌ చౌటుప్పల్‌లో స్విచాఫ్‌ అయ్యింది. దీంతో పోలీసులు.. చౌటుప్పల్‌ పరిసరాల్లోని మూతపడ్డ ఫార్మా కంపెనీలపై దృష్టిసారించారు. ఫోన్‌ స్విచాఫ్‌ అవ్వడానికి ముందు వేదప్రకాశ్‌ ఎవరెవరితో మాట్లాడాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? అనే కోణాలపై దృష్టిసారించారు.

అటు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలోనూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) పలు ఫార్మా కంపెనీల్లో డ్రగ్స్‌ తయారీ గుట్టును రట్టు చేసింది. గత ఏడాది ఆగస్టు 17న నగరంలోని ఓ పరిశ్రమతో పాటు, ముంబైలోని మరో పరిశ్రమలో దాడులు చేపట్టింది.

ఈ దాడుల్లో నగరంలో రూ.97కోట్లు విలువ చేసే 500 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. కొంపల్లి, చర్లపల్లి, చౌటుప్పల్‌ ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి డ్రగ్స్‌ తయారీ కంపెనీలను డీఆర్‌ఐ గుర్తించింది.