తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ 

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ హిమా కోహ్లితో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె నేరుగా హైకోర్టుకు చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఇప్పటి వరకు సీజేగా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ బదిలీపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పదోన్నతిపై జస్టిస్‌ హిమా కోహ్లి బాధ్యతలు చేపట్టారు. . ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన హిమాకోహ్లి పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా సీజేగా నియమితులయ్యారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం జ‌స్టిస్ హిమా కోహ్లీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
కాగా జస్టిస్ హిమాకోహ్లి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. జస్టిస్‌ హిమ కోహ్లీ 1979లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి బీఏ ఆనర్స్‌ హిస్టరీలో పట్టభద్రులయ్యారు. తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 
 
1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా నమోదై.. న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులయ్యారు. సుమారు 15 నెలల తరువాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్‌-19 విస్తరణ నేపథ్యంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీకి హిమ కోహ్లీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.