మై హోం అక్రమాలపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు 

మై హోం గ్రూప్ సంస్థ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ లేఖ రాశారు. రిజర్వు ఫారెస్టులో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖ మూడుసార్లు నోటీసులిస్తే, అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా అదనంగా మరికొన్ని భూములిచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
చట్ట విరుద్ధంగా రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కేంద్ర మైనింగ్ శాఖ స్వయంగా నోటీసులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరూ చర్యలు తీసుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మైనింగ్ శాఖ ఇచ్చిన 3 నోటీసులతోపాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఆయన  లేఖకు జత చేసి సోమేష్ కుమార్ కు పంపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయమై స్పందించాలని అరవింద్ డిమాండ్ చేశారు.  మైం హోం గ్రూప్ యాజమాన్యం రిజర్వు ఫారెస్టులో చేస్తున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను నిలిపేసేలా తీసుకున్న చర్యలతో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎంపీ అరవింద్ కోరారు.