డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ నటి… ముంబై హోటల్ లో అరెస్ట్ 

ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ నుంచి తప్పించుకొని, సోమవారం ప్రత్యక్షం కావడం సంచలనం కలిగిస్తున్నది.  శ్వేతా కుమారికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్టు  భావిస్తున్నారు.
కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్‌సీబీ విసృతంగా గాలింపు మొదలుపెట్టింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సీబీ అప్రమత్తం చేసింది. 
 
 ఇప్పటి వరకు హిందీ, కన్నడ నటులు డ్రగ్స్ కేసులలో అరెస్ట్ అవుతూ వస్తుండగా, తాజాగా తెలుగు నటుల వంతు వచ్చింది. 
22-ఏళ్ళ ఈ నటి నాలుగు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అధికార వాదనల కధనం ప్రకారం గత శనివారం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అధికారి చాంద్ మొహమ్మద్ షైక్ అనే వ్యక్తి నుండి 400 గ్రాముల, రూ 10 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో కరీంలాలా అనే డ్రగ్ డీలర్ నుండి పొందిన్నట్లు తెలపడంతో అతను నివాసం ఉంటున్న ఒక హోటల్ పై దాడి చేశారు. రౌడీ షీటర్ అయినా ఆ వ్యక్తి ఆ విషయం తెలుసుకొని పరారయ్యాడు. అయితే అదే హోటల్ లో టాలీవుడ్ నటి ఉండడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
మాఫియా డాన్ కరీంలాలాతో కలిసి నటి డ్రగ్స్ బిజినెస్ చేస్తోందని అనుమానిస్తున్నారు. బాంద్రా, కుర్ల, అందేరిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడ్డారు. చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.