భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ కూ ఆమోదం 

 భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌కు సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన కమిటీ.. షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సిఫారసు చేసింది. 
 
వైద్య నిపుణుల బృందం చేసిన సిఫారసులపై డీసీజీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడీఎస్‌ సీఓ సిఫారసును అనుమతించిన తర్వాత కేంద్రం ప్రభుత్వం కొవాగ్జిన్‌ పంపిణీని ప్రారంభించనుంది. దేశంలో అత్యవసర వినియోగానికి ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. 
 
శుక్రవారం కొవిషీల్డ్‌ను సిఫారసు చేయగా.. శనివారం కొవాగ్జిన్‌కు ఆమోద ముద్రవేయాలని డీసీజీఐని కోరింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. కొవాగ్జిన్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా.
ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది. గత నెలలో అమెరికా ఫైజర్‌ కంపెనీ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేయగా.. అనంతరం సీరం ఇనిస్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకున్నాయి.
వాటిని పరిశీలించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ డిసెంబర్‌ 9, 30వ తేదీల్లో కొవాగ్జిన్‌ టీకాపై కంపెనీని అదనపు సమాచారాన్ని కోరింది. మూడు దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సహా భారత్‌ బయోటెక్‌ సమర్పించిన అదనపు సమాచారాన్ని సుదీర్ఘంగా పరిశీలించిన నిపుణుల కమిటీ షరతులతో కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. మొదటి దశలో దాదాపు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కోటి మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులతో పాటు, రెండు కోట్ల ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, అత్యవసర విభాగాల్లో పని చేసే కార్మికులు, 50 ఏళ్లుపైబడిన 27 కోట్ల మంది వృద్ధులకు ఇవ్వాలని భావిస్తోంది.
టీకా సరఫరా, నిల్వ, లాజిస్టిక్స్‌ నిర్వహణలో కోల్డ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌తో సహా పరిపాలనను సన్నద్ధం చేయడానికి టీకా డ్రై రన్‌ను దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శనివారం నిర్వహించింది.