ఎల్ఎర్ఎస్ను ఏం చేద్దామనే విషయంలో తెలంగాణ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. అయితే దీనిపై పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిలో ఈ స్కీమ్ను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయడం కష్టమని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలియవచ్చింది.
ఎల్ఎర్ఎస్ కారణంగానే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నెగిటివ్ తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు లేకుండా స్కీమ్ను ఎలా అమలు చేయాలనే అంశంపై రియల్టర్లు, స్థానిక నాయకులూ, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్ఎర్ఎస్ ఫీజు ప్రజలకు భారంగా మారింది. దీంతో ఎల్ఎర్ఎస్ రద్దు కోసం రియల్టర్ అసోషియేషన్లు ఆందోళన బాట పట్టాయి. రేపు జాతీయ రహదారుల దిగ్బంధనం చేయనున్నారు. జనవరి 2న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహారదీక్షలకు పిలుపు ఇచ్చారు.
దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు ఉన్నాయి. ఎత్తివేయడం, లేదా ఉచితంగానే రెగ్యులరైజ్ చేయడం, ఫీజును తగ్గించడం లేదా ముందు కొంత ఫీజు కట్టించుకుని మిగతా ఫీజును నిర్మాణ సమయంలో చెల్లించే వెసులుబాటు కల్పించడం.. వీటిలో ఏదో ఒక దానిని ముఖ్యమంత్రి ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు