30న చర్చలకై రైతులకు కేంద్రం ఆహ్వానం 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పలిచింది. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ణాన భవన్‌లో మద్యాహ్నం రెండు గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయమై రైతులకు ఓ లేఖ రాసింది. 

ఆ లేఖలో చర్చలకు సంబంధించిన మరిన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిరసనలో ఉన్న వివిధ రైతు సంఘాల నేతలను ప్రస్తావిస్తూ ఈ లేఖను విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీన రైతు సంఘాలు పంపిన ఈమెయిల్‌ను ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం  రైతులతో చర్చలు జరిపేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

గతంలో జరిగిన చర్చలను లేఖలో ప్రస్తావిస్తూనే మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. ఈ చర్చల్లో మూడు వ్యవసాయ చట్టాలతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), వ్యవసాయ అనుబంధ ఇతర అంశాలపై విస్తృత చర్చ జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

‘‘మేం చేస్తున్న ఈ అభ్యర్థనను దయచేసి వినండి.. డిసెంబర్ 30న మద్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ణాన్ భవన్‌లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలోని బృందంతో సమావేశం కావాల్సిందిగా రైతులను కోరుతున్నాం’’ అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ముందు అందులో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూష్ గోయ‌ల్ స‌మావేశం కానున్నారు.