వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి  

 

‘2023 ఎన్నికలే మన లక్ష్యం. అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే మన లక్ష్యం కావాలి. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి” అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ పిలుపిచ్చారు. వరుసగా రెండు రోజులపాటు పార్టీ నేతలతో పది నిర్వహించిన ఆయన  సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారని, అందుకే ప్రత్యామ్న్యాయంగా తమ పార్టీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. 

రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ఆఫీసు బేరర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ జిల్లా ఇన్​చార్జ్​లతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీకి పూర్తి అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. పార్టీ లీడర్లు కూడా వారి ఆశలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.

టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు నిత్యం ఏదో ఒక సమస్యపై పోరాడాలని దిశా నిర్దేశం చేశారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్​లో గెలుపుతో పార్టీలో మంచి ఊపు వచ్చిందని, దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని తరుణ్ చుగ్ సూచించారు. ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, హైదరాబాద్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లలో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని ఆదేశించారు.

‘‘దశాబ్దాలుగా ఎందరో కార్యకర్తలు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం ప్రాణ త్యాగం చేశారు. నీడ, తిండి లేని చోట నిలబడి పని చేసిన కార్యకర్తలు బీజేపీకి ఉండడం వల్లే ఈ రోజు దేశంలో ఈ స్థాయికి  చేరుకోగలిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ బలపడింది. ఇంతకాలం ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక చివరి శ్వాస దాకా ఇదే జెండాను పట్టుకోవాలి” అని కోరారు.

పార్టీలో చేరిన చాలా మంది నాయకులు అదృష్టవంతులని, వారికి ఎమ్మెల్యే అయ్యే అదృష్టం దక్కుతుందని చెప్పారు. నాయకులు పని విభజన చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు